మోదీకి జగన్‌మోహన్‌రెడ్డి లేఖ

మోదీకి జగన్‌మోహన్‌రెడ్డి లేఖ

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఏపీలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎంటీసీ బృందాలను రాష్ట్రానికి పంపాలని కోరారు.

భారీవర్షాల వల్ల 6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం లేఖలో పేర్కొన్నారు.‘‘నాలుగు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని’’ సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో వివరించారు.

‘‘తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేటలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. 196 మండలాలు నీటమునిగాయి. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులు గండ్లు పడడం వల్ల చాలా ప్రాంతాలు నీటమునిగాయని’’ సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు.