ఎట్టకేలకి దొంగలు దొరికారు….రాంజీ ముఠా పనే 

హైదరాబాద్ నగర శివారు వనస్థలిపురంలో ఏటీఎం చోరీ కేసును రాచకొండ పోలీసులు చేధించారు. మే 7వ తేదీ ఉదయం వనస్థలిపురం పనామా జంక్షన్ వద్ద యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన వాహనంలో సిబ్బందిని కొందరు దుండగులు దృష్టి మళ్లించి రూ.70 లక్షలు ఉన్న నగదు పెట్టెను తీసుకెళ్లిపోయారు.

జరిగిన దొంగతనాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనేనని పోలీసులు ముందుగా భావించారు. అయితే వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించిన తర్వాత ఇది రాంజీ ముఠా పనిగా గుర్తించారు.

నిందితులను పట్టుకునేందుకు 20 స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటుచేశారు. మూడు నెలల అనంతరం ఎట్టకేలకు పోలీసులు నిందితులను పట్టుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు.

ఈఘటనకు పాల్పడింది రాంజీ ముఠాయేనని పోలీసులు గుర్తించినా నిందితులను పట్టుకోవడానికి మూడు నెలలు పట్టింది.చోరీకి పాల్పడిన తమిళనాడుకు చెందిన రాంజీ ముఠాను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు