కరోనా ఫోర్త్‌ వేవ్‌ హెచ్చరికలు

కరోనా ఫోర్త్‌ వేవ్‌ హెచ్చరికలు

దేశంలో కరోనా కేసుల విజృంభణ మళ్లీ మొదలవుతోందా? డెయిలీ కేసుల పెరుగుతుండడం అందుకు నిదర్శనమా? జూన్‌ కంటే ముందే.. ఫోర్త్‌ వేవ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయా?.. అవుననే సంకేతాలు ఇ‍స్తూనే అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.భారత్‌లో వరుసగా 11 వారాల పాటు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో ఒక్కసారిగా పెరుగుల చోటు చేసుకుంది.

గత ఒక్కవారంలోనే 35 శాతం కేసులు పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వెయ్యికి దిగువనే నమోదవుతున్నాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య ఒకేసారి రెండు వేలను దాటేసింది. గత 24 గంటల్లో 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు నమోదైన కేసుల సంఖ్య 1,150 మాత్రమే. అంటే కేసుల సంఖ్య ఒక్క రోజులోనే దాదాపుగా 90 శాతం మేర పెరిగింది.

రోజూవారీ పాజిటివిటీ రేటు చూసుకుంటే.. 0.31 శాతం నుంచి 0.83 శాతానికి పెరిగింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో ఇన్‌ఫెక్షన్‌ల పెరుగుదల ఎక్కువగా నమోదు అయ్యింది. అయితే చాలాచోట్ల కేసులు తగ్గుముఖం పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నా.. కొత్త వేరియెంట్లను తక్కువగా అంచనా వేయొద్దని, కేసులు ఒక్కసారిగా వెల్లువెత్తే అవకాశం లేకపోలేదని, ఈ పెరుగుదలను ఫోర్త్‌ వేవ్‌కి సంకేతాలుగా భావించి అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.