తమ కూతురి వివాహానికి అడ్డుపడుతున్న యువకుడిని యువతి తల్లిదండ్రులు దారుణంగా హతమార్చారు. అనంతరం కారులో మృతదేహాన్ని తరలించి దహనం చేశారు. ఈ సంఘటన యూపీలోని మథుర జిల్లాలో చోటుచేసుకుంది. యువతి, ఆమె తల్లిని పోలీసులు అరెస్టు చేయగా.. తండ్రి పరారీలో ఉన్నాడు. సీనియర్ సూపరింటెండెంట్ శైలేష్ కుమార్ ఈ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
మథర జిల్లాలోని ఫరా ప్రాంతంలో ఓ కారు కాలిపోయినట్లు గత సోమవారం పోలీసులకు సమాచారం వచ్చింది. అక్క డికి వెళ్లి పరిశీలించగా.. కారులో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కీలక విషయాలు బయటపడ్డాయి. మృతి చెందిన వ్యక్తిని హథ్రాస్కు చెందిన పుష్పేంద్ర యాదవ్గా గుర్తించారు. అతడు అగ్రాలో ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తున్న సమయంలో 20 ఏళ్ల డాలీ పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో వారి ప్రేమకు నిరాకరించారు. ఇద్దరూ పారిపోయి పెళ్లిచేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో యువతి తండ్రి అవదేశ్ యాదవ్ తన కూతురికి పెళ్లి సంబంధాలు చూడడంతో పుష్పేంద్ర యాదవ్ వాటికి అడ్డుపడ్డాడు. దీంతో కక్ష పెంచుకున్న అవదేశ్, తన భార్య భూరీ దేవి తమ కూతురితో ఫోన్ చేయిం చి ఆ యువకుడిని ఇంటికి రప్పించారు. ప్లాన్లో భాగంగా ఇతర బంధువులతో కలసి పుష్పేంద్రను హత్య చేశారు.
అనంతరం కారులో మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి దహనం చేశారు. యువకుడి హత్యలో యువతి తల్లిదండ్రులతో పాటు ఇతరుల హస్తం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అవదేశ్తో పాటు అతడి కుమారుడు, ఇతర బంధువులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. మథురలో బెదిరింపులు, కిడ్నాప్లు, హత్యల వంటి నేర చరిత్ర ఉన్న భురా గ్యాంగ్లో అవదేశ్ యాదవ్ సభ్యుడని శైలేష్ పేర్కొన్నారు.