యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం డ్రోన్ దాడి జరిగింది. ఈ డ్రోన్ దాడిలో మూడు అయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
అబుదాబి విమానాశ్రయంలోని ఓ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, ఏడీఎన్ఓసీ సంస్థకు చెందిన చమురు నిల్వలు ఉన్న పారిశ్రామిక ప్రాంతం ముసఫాలో మూడు ఇంధన ట్యాంకర్ ట్రక్కులు పేలిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ డ్రోన్ దాడుల్లో ఇద్దరు భారతీయులు, ఓ పాకిస్తాన్ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఘటన స్థలంలో చిన్న విమానానికి సంబంధించిన భాగాలు కనిపించాయని, రెండు ప్రదేశాల్లో చోటు చేసుకున్న పేలుడు, అగ్ని ప్రమాదానికి డ్రోన్ దాడులు కారణమని పోలీసులు పేర్కొన్నారు. డ్రోన్ దాడులకు తామే పాల్పడ్డామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
