డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ, డ్రంకెన్‌ డ్రైవ్‌లు, పెండింగ్‌ చలాన్ల వసూళ్లపై రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య రాచకొండ పరిధిలో 40,620 కేసులను నమోదు కాగా.. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, డ్రంకెన్‌ డ్రైవ్‌ కలిపి సుమారు రూ.కోటిన్నర జరిమానా విధించారు. ఇందులో అత్యధికంగా హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 26,475 కేసులు నమోదు కాగా.. రూ.48,98,900 ఫైన్లు విధించారు.

రాచకొండ కమిషరేట్‌ పరిధిలో వారం రోజుల్లో 49 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులను నమోదయ్యాయి. రూ.4,38,500 జరిమానా విధించారు. 176 మందిని కోర్టులో హాజరుపరచగా ఇద్దరికి జైలు శిక్ష పడింది. అత్యధికంగా వనస్థలిపురంలో 10 కేసులు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాలదారులపై 38 కేసులు బుక్కవగా.. త్రీవీలర్స్‌పై 2, ఫోర్‌ వీలర్‌ వాహనాదారులపై 9 కేసులు నమోదయ్యాయి.

కమిషనరేట్‌ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 54 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. వీటిలో పది మంది దుర్మరణం చెందగా.. 50 మందికి గాయాలయ్యాయి. తీవ్రత వారీగా చూస్తే 10 కేసులు ఘోరమైన ప్రమాదాలు కాగా.. 44 సాధారణ రోడ్డు ప్రమాదాలున్నాయి. ఆయా డేటాను విశ్లేషించగా మానవ తప్పిదాలు, రహదారి ఇంజనీరింగ్‌ లోపాలతోనే జరిగాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, వాహనాలు వాటంతటవే ప్రమాదాలకు గురికావడం కారణాలని రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ డి.శ్రీనివాస్‌ తెలిపారు.