హెడ్‌ కోచ్‌గా పాల్‌ కాలింగ్‌వుడ్‌

హెడ్‌ కోచ్‌గా పాల్‌ కాలింగ్‌వుడ్‌

విండీస్‌తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్‌ సిరీస్‌ నిమిత్తం ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. కాలింగ్‌వుడ్‌ నియామకం తాత్కాలిక ప్రాతిపదికన జరిగినట్లు ఈసీబీ పేర్కొంది. తాజాగా విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ కోసం ఇంచార్జ్‌ కోచ్‌గా వ్యవహరించిన కాలింగ్‌వుడ్‌.. సెలవు నిమిత్తం కరీబియన్‌ దీవుల్లోనే ఉన్నాడని, ఫిబ్రవరి 25న ఇంగ్లండ్‌ జట్టు అక్కడి చేరుకోగానే అతను బాధ్యతలు చేపడతాడని ఈసీబీ డైరెక్టర్‌ ఆండ్రూ స్ట్రాస్‌ వెల్లడించాడు.

ఈ పర్యటనలో ఇంగ్లండ్‌ ఓ వార్మప్‌ మ్యాచ్‌తో పాటు 3 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. మార్చ్‌ 1 నుంచి విండీస్‌ టూర్‌ ప్రారంభంకానుంది. కాగా, తాజాగా జరిగిన టీ20 సిరీస్‌లో కాలింగ్‌వుడ్‌ ఆధ్వర్యంలోని ఇంగ్లీష్‌ జట్టు విండీస్‌ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, యాషెస్‌ సిరీస్‌ 2021-22లో ఆసీస్‌ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి బాధ్యున్ని చేస్తూ ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌ సిల్వర్‌వుడ్‌కు ఈసీబీ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.