క్లినికల్ ట్రయల్స్‌లో ఫెయిల్.. ఆ ఔషధం‌‌పై ఆవిరైన ఆశలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న వైరస్ కరోనాకు ఇంతవరకు ఎలాంటి మందు కనిపెట్టలేదు. వైద్యంకానీ.. వ్యాక్సిన్ కానీ అందుబాటులో లేదు. దీంతో కొన్ని ఔషధాలు మహమ్మారిపై సమర్ధవంతంగా పనిచేస్తాయని అంతా భావిస్తున్నారు. కరోనా వైరస్ బాధితులకు చికిత్సలో సమర్ధంగా పనిచేస్తుందని ఇప్పటి వరకు భావించిన యాంటీవైరల్‌ డ్రగ్‌ ‘రెమ్‌డెసివిర్‌ ’తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌‌లో ఫెయిల్ అయింది. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ముసాయిదా పత్రాన్ని అనుకోకుండా ప్రచురించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రచురించిన ముసాయిదా ప్రకారం.. రెమ్‌డెసివిర్‌ కరోనా రోగులపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అయితే నివేదికను వక్రీకరించారని కూడా తెలుస్తోంది. క్లినికల్ ట్రయల్స్ ముసాయిదా పత్రాన్ని డబ్ల్యూహెచ్‌ఓ తన వెబ్‌సైట్‌ నుంచి ఆ తర్వాత తొలగించింది. ఇది మెరుగైన ఫలితాలిస్తున్నట్లు గతంలో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇటు భారత్‌లో ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త ఒకరు తెలపడంతో ఈ డ్రగ్‌పై సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఫైనాన్సియల్ టైమ్స్ ప్రకారం.. చైనాలో కరోనా వైరస్‌ బారినపడ్డ 237 మందిని ఈ అధ్యయనానికి ఎంపికచేసి రెండు వర్గాలుగా విభజించారు. వీరిలో 158 మందికి, మిగతా 79 మందికి ఎలాంటి ఔషధాలు ఇవ్వకుండా పరిశీలించారు.

రెండు బృందాల్లోని వ్యక్తుల్లో సంభవించిన మార్పుల్ని రోజూ వైద్యులు గమనించారు. ఒక నెలరోజుల తర్వాత రెమ్‌డెసివిర్ తీసుకున్నవారిలో 13.9శాతం, తీసుకోనివారిలో 12.8శాతం మృతి చెందారు. అలాగే డ్రగ్ తీసుకున్నవారికి దుష్ప్రభావాలు రావడంతో తొలి దశలోనే ప్రయోగాల్ని నిలిపి వేశారు. చివరగా.. రెమ్‌డెసివిర్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవన్న నిర్ధారణకు వచ్చారు. డబ్ల్యూహెచ్‌ఓ చర్యతో గిలీడ్‌ సైన్సెస్‌ తీవ్రంగా విభేదించింది. అధ్యయనానికి సంబంధించిన ఫలితాలపై తప్పుడు నివేదిక ప్రచురించిందని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అంతేకాకుండా క్లినికల్ ట్రయల్స్‌కు రోగులు పెద్దగా ముందుకు రాలేదని.. అందుకే పరీక్షల్ని తొలిదశలోనే నిలిపివేశామని స్పష్టం చేశారు. తక్కువ మందిపై ప్రయోగించి ఓ నిర్ణయానికి రావడం సరికాదని పేర్కొన్నారు. అయితే.. వైరస్‌ తొలిదశలో ఉన్నవారికి ఆశాజనక ఫలితాలున్నట్లు మాత్రం సమాచారం ఉందన్నారు. దీంతో డ్రగ్‌ వాడకానికి సంబంధించిన ప్రయోగాలు నిలిచి పోలేదని.. ఇంకా పరీక్షలు కొనసాగుతాయని తెలిపింది.

కాగా కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్‌ చికిత్సలో రెమ్‌డెసివిర్ వినియోగంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. చికాగో ఆసుపత్రిలోని కరోనా రోగులకు చికిత్సలో వినియోగించగా గణనీయమైన సామర్థ్యాన్ని చూపించిందని గతవారం ఓ నివేదిక తెలిపింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో కోవిడ్-19 రోగులు చికిత్స పొందుతున్నారు. రెమ్‌డెసివిర్ ఔషధాన్ని కోతులపై ప్రయోగించగా.. అది విజయవంతమయ్యిందని అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది.

వైరస్‌పై ప్రత్యక్షంగా పనిచేసే ఔషధాల వర్గానికి చెందిన రెమ్‌డెసివిర్.. స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందనను నియంత్రించడానికి అసాధారణ సందర్భాల్లో దీనిని వాడతారు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.