కూతురిని చంపిన తండ్రి

కూతురిని చంపిన తండ్రి

పరువు కోసం ఓ తండ్రి తన కుమార్తెను కడతేర్చాడు. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె పట్టణం గాండ్ల వీధిలో జరిగింది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన కథనం మేరకు..పోరుమామిళ్ల వనజారాణి (29)కి గురువేంద్రతో 2009లో వివాహమైంది. వీరి కుమార్తె గురు పూజిత మూడో తరగతి చదువుతోంది. గురువేంద్ర బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన క్రమంలో వనజారాణి తన తల్లిదండ్రుల వద్ద ప్రొద్దుటూరులో ఉంటూ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌ నుంచి ఆమె భర్త వేంపల్లెకు వచ్చాడు.

అప్పటి నుంచి ఆమె తన భర్తతో తనకు విడాకులు ఇవ్వాలని, మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనిపై వారం రోజుల నుంచి భర్తతో ఆమె గొడవపడుతోంది. విషయాన్ని వనజారాణి తల్లిదండ్రులకు గురువేంద్ర చెప్పి ఆమెకు నచ్చజెప్పాలని వారిని కోరాడు. వనజారాణి తండ్రి రాజశేఖర్, చిన్నాన్న జనార్థన్, మరొకరు శనివారం రాత్రి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆమె వినిపించుకోలేదు. దీంతో చున్నీని మెడకు చుట్టి ఆమెను హత్య చేశారు. సీఐ వెంకటేశ్వర్లు తండ్రి, చిన్నాన్న, మరొకరిపై ఆదివారం కేసు నమోదు చేశారు