సినీఫక్కీలో పసిబిడ్డను కిడ్నాప్ చేసిన దుండగుడు 

four-years-girl-kidnapped-from-parents-in-secunderabad

తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించి సికింద్రాబాద్‌లో ఓ దుండగుడు నాలుగేళ్ల పాపను సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశాడు. సికింద్రాబాద్‌లోని రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.

రామ్ గోపాల్ పేటలో నివాసం ఉండే రాజు, హాజిరా దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె ఫాతిమా (4), కుమారుడు రమేష్ (3), 3 నెలల చిన్నారి మౌనిక ఉన్నారు. మౌనిక రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.

ఆ చిన్నారిని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లడానికి దంపతులిద్దరూ తమ ముగ్గురు పిల్లలను తీసుకొని బయలుదేరారు. సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద బస్సు దిగిన రాజు, హాజిరా దంపతులు తమ పిల్లలను ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి బాగున్నావా అంటూ రాజును పలకరించాడు.

ఫంక్షన్ హాల్‌లో పని చేసే రాజు అతడు తనకు ఎప్పుడో పరిచయం ఉన్న వ్యక్తి కాబోలు అనుకొని మాటలు కలిపాడు. ముగ్గురు పిల్లలను ఎలా మోస్తారని అంటూ ఆ దుండగుడు రాజు వద్ద ఉన్న బ్యాగుతో పాటు ఫాతిమాను ఎత్తుకున్నాడు. కాస్త దూరం వెళ్లిన తర్వాత ఫాతిమా ఆకలిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో వారు పాలు కొనుగోలు చేయడానికి ఓ హోటల్‌లోకి వెళ్లారు. పాపను ఎత్తుకొని తాను బయటే ఉంటానని చెప్పిన ఆ దుండగుడు పాలు తీసుకొని రమ్మని ఆ దంపతులను పురమాయించాడు. అతడి మాటలు నమ్మి వాళ్లు హోటల్‌ లోనికి వెళ్లి వచ్చారు.

బయటకి వచ్చి చూసే సరికి పాపతో పాటు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో షాక్ తిన్నారు. దీంతో రామ్ గోపాల్ పేట పోలీసులను ఆశ్రయించారు. దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.