మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల మైనర్‌ బాలికపై స్థానిక పూజారి (55) మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం ప్రకంపనలు పుట్టిస్తోంది ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన దాదాపు 200 మంది స్థానికులు భారీ నిరసనకు దిగారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. పూజరితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు డీసీపీ ఇంగిత్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రకటించారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబ్‌ అధికారులు క్రైమ్ బృందం దర్యాప్తు కోసం నమూనాలను సేకరించారని దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ హామీ ఇచ్చారు. పోలీసులు న్యాయమైన దర్యాప్తు చేపట్టాలన్నారు.

లేదంటే ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్వీట్‌లో తెలిపింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.పోలీసులు అందించిన సమాచారం ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని శ్మశానవాటికు సమీపంలో మోహన్ లాల్, సునీతా దేవి దంపతులు ఇంట్లో నివసిస్తున్నారు. వీరి కుమార్తె బాలిక శ్మశాన ప్రాంగణంలోకి వెడుతూ వుంటుంది. అలాగే ఫ్రిజ్‌లో నీళ్లు తాగేందుకు ఆదివారం సాయంత్రం కూడా వెళ్లింది. ఆ తరువాతనుంచి కనిపించకుండా పోయింది. కుమార్తెకోసం వెదుకుతున్న తల్లి అక్కడికెళ్లి చూడగా మృతదేహం కనిపించింది.

దీంతో ఫ్రిజ్ వాటర్ తాగుతున్న సమయంలో బాలిక విద్యుత్ షాక్‌కి గురై చనిపోయిందని ఆ పూజారి, అక్కడే పనిచేసే మరో ముగ్గురు సిబ్బంది నమ్మ బలికారు. అంతేకాదు పోస్టుమార్టం పేరుతో భయపెట్టి, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించారు. పోలీసులు అమ్మాయి అవయవాలను అమ్ముకుంటారంటూ కల్లబొల్లి మాటలతో మభ‍్య పెట్టారు. కుటుంబ సభ్యులంతా ఈ అమోమయంలో ఉండగానే హడావిడిగా బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

దీంతో బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలను గమనించిన తల్లిదండ్రులకు తమ అనుమానం మరింత బలపడింది. చివరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెను అత్యాచారం చేసి చంపేసారంటూ పూజారి సహా నలుగురిపై ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూజారి రాధేశ్యామ్, సలీమ్, లక్ష్మీ నారాయణ్, కుల్దీప్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.