మానసికంగా కుంగిపోయి యువతి ఆత్మహత్య

మానసికంగా కుంగిపోయి యువతి ఆత్మహత్య

పుట్టింటి వారి ఆదరణ కరువైందని మానసికంగా కుంగిపోయి మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం అంబర్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌ కథనం మేరకు.. పటేల్‌నగర్‌లో శివారెడ్డి, ధనలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ధనలక్ష్మి తల్లి చిన్నప్పుడే మరణించడం, నాన్న మరొకరిని వివాహం చేసుకోవడంతో పుట్టింటి వారి ఆదరణ కరువైందని కొంత కాలంగా మానసికంగా ఇబ్బంది పడుతుంది.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భర్త, పిల్లలతో కలిసి పడుకుంది. తెల్లవారుజామున 5 గంటలకు భర్త లేచి చూస్తే ధనలక్ష్మి కనిపించలేదు. హాల్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించగా బెడ్‌రూం తలుపు బయట నుంచి గడిపెట్టి ఉంది. దీంతో ఇంటి యజమానికి ఫోన్‌ చేయగా బలవంతంగా ఇంటి తలుపులు తీసి లోపలికి వచ్చారు. అప్పటికే ఆమె హాల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.