పండక్కి డబ్బులు ఇవ్వలేదని యువతి ఆత్మహత్య

పండక్కి డబ్బులు ఇవ్వలేదని యువతి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారంలో విషాదం చోటుచేసుకుంది. దసరా పండక్కి దుస్తులు కొనుక్కోవడానికి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కూనారం గ్రామానికి చెందిన అరెల్లి తిరుపతి, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు అఖిల డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో కొత్త బట్టలు కొనుక్కోవడానికి రూ.2 వేలు కావాలంటూ నాలుగు రోజులుగా తండ్రిని అడుగుతోంది.

అయితే ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని ఆయన సర్దిచెప్పడంతో అఖిల మనస్తాపానికి గురైంది. ఆదివారం తండ్రి కౌలుకు చేస్తున్న పొలం వద్దకు సైకిల్‌పై వెళ్లి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అఖిల మృతితో తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కాల్వశ్రీరాంపూర్ పోలీసులు తెలిపారు.