ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వేతన సవరణ ఓ కొలిచ్చి రావడంతో వచ్చే నెల ఒకటో తేదీనే ఉద్యోగులు కొత్త జీతాలు అందుకోనున్నారు. 96శాతం ట్రెజరీల్లో బిల్లులు రెడీ కావడంతో పెరిగిన వేతనాలతో కొత్త స్కేల్‌ను అనుసంధానం చేసి కొత్త వేతనాలకు బిల్లులు రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే గత నెల రావాల్సిన సప్లిమెంటరీ శాలరీ ఎరియర్స్‌పై ఇంకా సంధిగ్ధత నెలకొంది.

రాష్ట్రంలోని 12 జిల్లాలను సప్లిమెంటరీ శాలరీపై పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం తీసుకుంది. అయితే సాఫ్ట్‌వేర్ సహకరించకపోవడంతో సుమారు 4శాతం ఉద్యోగులకు చెల్లింపులు పెండింగ్ పడ్డాయి. ఈ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో వీరితో పాటు మిగిలిన జిల్లాల ఉద్యోగులకు ఈ నెల ఎరియర్స్‌ జమ చేస్తారా? లేదా? అన్నది సందేహంగా మారింది.

ఏప్రిల్ నుంచి 30శాతం పీఆర్సీని అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఏప్రిల్, మే నెల ఎరియర్స్‌ను ఏడాదిలో ఎప్పుడైనా విడుదల చేస్తామని, జూన్‌లో పెరిగిన వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేసింది. అయితే సాంకేతిక లోపంతో జూన్‌ నెలలోనూ పాత వేతనాలే ఇచ్చారు. దీంతో జూన్ నెల ఏరియర్స్ కూడా పెండింగ్‌లో పడ్డాయి. దీంతో గత నెల ఎరియర్స్ ఎప్పుడిస్తారన్నది తెలియడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు సైతం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.

మరోవైపు పెరిగిన జీతాన్ని ఉద్యోగులు ఆగస్టు నెలలో అందుకోనున్నారు. హైదరాబాద్‌ పరిధిలో హెచ్ఆర్ఏ 30శాతం నుంచి 24శాతానికి కుదించడంతో దీని ప్రకారమే వేతనాలను సవరించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఆగస్టులో పెరిగిన వేతనాలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 15 రోజుల్లోగా బెనిఫిట్స్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అధికారులను ఆదేశించినా అమల్లో మాత్రం అది కార్యరూపం దాల్చడం లేదు. గతేడాది ఆగస్టు నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, కమ్ముటేషన్, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ ఇంకా చెల్లించలేదు. దీంతో తమకు రావాల్సిన ప్రయోజనాలకు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.