ప్రయాణీకులకు రైల్వే శుభవార్త

ప్రయాణీకులకు రైల్వే శుభవార్త

ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కోవిడ్ అనంతరం ప్రత్యేక రైళ్లుగా నడుపుతున్న వాటిని గతంలో మాదిరిగానే సాధారణ రైళ్లుగా నడిపించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఆయా రైళ్లకు ‘ప్రత్యేక’ నంబర్లను తొలగించి పాత నంబర్లను కేటాయించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ‘రైల్వే టైమ్‌ టేబుల్- 2021’లో సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ అప్‌లోడ్‌ చేసింది.

ఇప్పటికే టికెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులకు మారిన రైలు నంబర్ల వివరాల్ని ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపించింది. 76 రైళ్లకు ప్రత్యేక నంబర్లకు ముగింపు పలికి రెగ్యులర్‌ రైళ్లుగా మార్చింది. ప్రధానంగా సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ స్టేషన్ల నుంచి హౌరా, తిరువనంతపురం, ధనపూర్‌, భువనేశ్వర్‌, అమృత్‌సర్‌, బెంగుళూరు, జమ్ముతావి, నాందేడ్‌, జైపూర్‌, తిరుపతి తదితర ప్రాంతాలకు నడుస్తున్న 76 రైళ్లను సాధారణ రైళ్లుగా పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు ప్రయాణికుల డిమాండ్‌ మేరకు నర్సాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు 21, 28 తేదీల్లో, సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు 22, 29న.. హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు 19న, గోరఖ్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు 21న ఒకటి చొప్పున మొత్తం ఆరు ప్రత్యేక రైలు ట్రిప్పులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం తెలిపింది. తెలంగాణ- మహారాష్ట్రకు సంబంధించి ప్రధానమైన కాజీపేట-బల్లార్షా ప్రాజెక్టులో భాగంగా విరూర్‌-మానిక్‌గఢ్‌ మధ్య 19.2కిలోమీటర్ల విద్యుదీకరణతో మూడో రైల్వే లైను ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.