దారుణం: మాజీ సర్పంచ్ కుటుంబంపై దాడి.. నలుగురికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం చోటు చేసుకుంది. గుంటూరులోని మాజీ సర్పంచ్ కుటుంబంపై రౌడీ మూకలు దాడులకు పాల్పడ్డారు. కాగ ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వినుకొండ మండలం కొప్పుకొండ గ్రామ మాజీ సర్పంచ్ నరసింహారావుపై దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులపైనా దాడికి దిగారు. ఈ దాడుల్లో నరసింహారావుతో పాటు నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 అయితే దాడులు చేసింది ఎవరు? ఎందుకు చేశారనే విషయాలు తెలియడం లేదు. కిరాయి రౌడీలు తమపై దాడి చేశారంటూ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కిరాయి మూకలను పంపించి మరీ దాడులు చేయించాల్సిన అవసరమేంటనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజకీయ కక్షలా? లేక వ్యక్తిగత తగాదాలా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ దాడులు పెరిగి పోయాయనే ఆరోపణలు వినిపిస్తుండటంతో ఈ ఘటన రాజకీయంగా జరిగి ఉండ వచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమౌతుంది. మరి పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.