ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే విప్లవాత్మక మార్పులు తీసుకునివస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అందుకోసం ఆగస్టు 15 నాటికి కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే రాబోయే రెండున్నర నెలల్లో ఊర్లలో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువతను గ్రామ వాలంటీర్లను నియమిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తామనీ, ఇందుకోసం ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ ను నియమిస్తామన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జగన్ మాట్లాడారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, ప్రజాసేవ చేయాలనుకునే పిల్లలను ఇందుకు ఎంపిక చేస్తామని జగన్ తెలిపారు. వీరికి గౌరవవేతనంగా రూ.5,000 చెల్లిస్తామని వెల్లడించారు. ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వాలంటీర్లకు ఈ మొత్తం చెల్లిన్చానున్నామని చెప్పారు. మెరుగైన ఉద్యోగాలు వచ్చేవరకూ ఈ పిల్లలకు గ్రామ వాలంటీర్లుగా అవకాశాలు కల్పిస్తామన్నారు. తమకు సంక్షేమ పథకాల ఫలాలు అందకుంటే, లంచాలు, వేధింపులు జరిగితే ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ ను కూడా ఆగస్టు 15న ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కాల్ సెంటర్ సీఎం కార్యాలయంలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎప్పుడైనా ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవచ్చని అన్నారు. గ్రామ సెక్రటేరియెట్ లో దరఖాస్తు చేసిన 75 రోజుల్లో శాంక్షనయ్యేలా చేస్తానని అన్నారు. నవరత్నాలలోని ప్రతి అంశాన్ని తు,చ. తప్పకుండా అమలు చేస్తానని పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ అవినీతి అన్నదే లేకుండా పూర్తిగా ప్రక్షాళన చేస్తానని జగన్ చెప్పారు. ఇప్పటి వరకూ అవినీతి జరిగిన కాంట్రాక్టులు, పనులను పూర్తిగా రద్దు చేస్తానని జగన్ ప్రకటించారు. అవసరమైతే రివర్స్ టెండరింగ్ ప్రాసెసింగ్ ను ప్రవేశపెడతామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మూడు దశల్లో మద్య నిషేదం అమలు చేస్తామని జగన్ అన్నారు. మద్య నిషేధం పూర్తిగా అమలు చేసిన తరువాతనే మళ్లీ ఓట్లడుగుతామని అన్నారు.