దివంగత సీఎం జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో మనకు తెలియనిది కాదు. ఆమె మరణించే నాటికీ పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉండగా ఆ తర్వాత శశికళ ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్లి మరీ రాజీనామా చేయించి తనకు నమ్మకస్తుడయిన పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే ఆ తర్వాత ఆయన్ను తప్పించి తన మేనల్లుడు టీటీవీ దినకరన్ ను సీఎం చేద్దామంటే అందుకు పళనిస్వామి అడ్డం తిరగడం దీంతో టీటీవీ దినకరన్ నేతృత్వంలో 18 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పార్టీ నుంచి బయటకు రావడం పళనిస్వామికి ఇచ్చిన మద్దతును వెనక్కు తీసుకుంటున్నట్టు గవర్నర్కు లేఖలు సమర్పించడం జరిగింది.
దీంతో స్పీకర్ పార్టీ విప్కు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ వారిపై అన్వర్షత వేటు వేశారు.దీంతో వారు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం పై జూన్ 14న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విభిన్న తీర్పులు వెలువరించింది. దీంతో దీని పై తుది తీర్పును మూడో న్యాయమూర్తికి అప్పగించారు. జులై 21 నుంచి కేసు విచారణ జరిపిన మూడో న్యాయమూర్తి సత్యనారాయణ ఆగస్టు 31వ తేదీన తీర్పును వాయిదా వేశారు. అప్పటి నుంచి తీర్పుపై పలు రకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సరైనదేనని న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు.
గతంలో పళని ప్రభుత్వానికి మద్దతుగా కూవత్తూర్లోని రిసార్ట్స్లో చిన్నమ్మ మద్దతు ఎమ్మెల్యేలు బసచేసిన తరహాలనే ప్రస్తుతం తిరునెల్వేలి జిల్లా కుట్రాలంలోని రిసార్ట్స్లో అనర్హత ఎమ్మెల్యేలు బస చేశారు. తీర్పు అనుకూలంగా వస్తే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దినకరన్ వర్గం ప్రయత్నించనున్నట్లు జరిగిన ప్రచారంతో ప్రభుత్వమూ అప్రమత్తమైంది. వెంటనే తమ ఎమ్మెల్యేలను మంత్రులను అందుబాటులోకి రప్పించుకున్న పళనిస్వామి కీలక చర్చలు జరిపారు. ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏమి చేయాలి అనే విషయం మీద వార్చు చర్చలు జరిపారు. అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో పళనిస్వామి సర్కారు ఊపిరి పీల్చుకుంది.