లోకేష్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం !

ఏపీ ఎన్నికల్లో ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన లోకేశ్, ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తుండగా పై నుంచి హోల్డింగ్ పడింది. అయిదే, ఆ బోర్డు కాస్తా ఆయనకు కూతవేటు దూరంలో పడటంతో నేతలు ఎవరూ గాయపడలేదు. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న టీడీపీ నేత, మంత్రి నారా లోకేశ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి నిడమర్రులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సద్గుణ టిఫిన్ సెంటర్ వద్ద లోకేశ్ మాట్లాడుతుండగా అక్కడ హోటల్ బోర్డు కుప్పకూలింది. లోకేశ్ సహా మిగిలిన నేతలంతా దానికి దూరంగా ఉండటంతో అది కార్యకర్తల మీద పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో లోకేశ్‌తోపాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సహా ముఖ్య నేతలు కూడా ఉన్నారు.