భవనం కుప్పకూలి 9 మంది దుర్మరణం

భవనం కుప్పకూలి 9 మంది దుర్మరణం

తమిళనాడులోని భారీ వర్షాల కారణంగా భవనం కుప్పకూలి 9 మంది దుర్మరణం చెందారు. వెల్లూరు జిల్లాల్లో శుక్రవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పెరనమ్‌పట్టు ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

మృతులను మిస్బా ఫాతిమా, అనీసా బేగం, రూహీ నాజ్, కౌషర్, అఫిరా, తాంజీలా, మౌనుల్లా, థామేడ్, అఫ్రాలుగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స కోసం వెల్లూరు, గుడియతం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. భారీ వర్షాలకు వీధిలోకి వరద నీరు చేరడంతో పలువురు ఆ భవనంపై రాత్రంతా తలదాచుకోగా.. ఓ కుటుంబం కింది ఫ్లోర్‌లో ఉంది. వరద నీటికి భవనం కింద భాగం కుంగిపోయి కుప్పకూలిందని అధికారులు తెలిపారు.

భవనం శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసే చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకూ 9 మంది చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. మరికొంత మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వెల్లూరు జిల్లా కలెక్టర్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50 వేలు అందజేయనున్నట్టు తెలిపారు.

దాదాపు రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చెన్నై, ఉత్తర తమిళనాడు సహా డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూర్‌, కాంచీపురం, వేలూర్‌, రాణిపేట, తిరుపత్తూర్‌, విళ్లుపురం, పుదుచ్చేరిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 20 వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని.. పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.