‘నో రిస్క్’ అంటున్న కాజల్ అగర్వాల్

'నో రిస్క్' అంటున్న కాజల్ అగర్వాల్

సౌత్ లో ఉన్న సీనియర్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. సౌత్ లో దాదాపుగా పెద్ద స్టార్ హీరోలందరితో జోడీ కట్టిన కాజల్ కొంతకాలం క్రితం నిర్మాతగా మారేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. తన మొదటి సినిమాకు ప్రశాంత్ వర్మను దర్శకుడిగా ఎంచుకుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. మొదట ‘అ!’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్నారని.. అ తర్వాత రీమేక్ ఆలోచన డ్రాప్ చేసుకుని ఫ్రెష్ గా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో ముందుకు పోవాలనుకున్నారని అన్నారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే కాజల్ అసలు నిర్మాతగా మారాలనే ఆలోచనను మానుకుందట.

ఈమధ్య కాజల్ నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. పైగా తమిళంలో నటించిన ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ ను రిలీజ్ సమస్యలు వెంటాడుతున్నాయి.  దీంతో ఇప్పుడు కొత్తగా రిస్కులు తీసుకోకుండా చేతిలో ఉన్న ప్రాజెక్టులపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయిందట. దీనికి కారణం కాజల్ నాన్నగారు వినయ్ అగర్వాల్  ‘డబ్బు విషయంలో జాగ్రతగా ఉండాలి’ అంటూ ఇచ్చిన సలహానే అని కూడా టాక్ వినిపిస్తోంది.  కాజల్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’.ఈ సినిమా కాకుండా హిందీలో జాన్ అబ్రహంతో ‘ముంబై సాగా’ అనే సినిమాకు సైన్ చేసింది.

ఇదిలా ఉంటే కాజల్ ప్రొడక్షన్ లో సినిమా క్యాన్సిల్ కావడంతో ప్రశాంత్ వర్మ మరో కొత్త స్క్రిప్ట్ పై పనిచేస్తున్నాడట. అక్కినేని అఖిల్ కోసమే ఈ స్క్రిప్ట్ అని.. ఇదో యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. అఖిల్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.