Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రకు జరిగిన అన్యాయం చూసి 11 రోజుల పాటు అన్నం తినలేదని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించడం ఆశ్చర్యకరం. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా రాజకీయ ప్రయాణం సాగించాలనుకుంటున్న పవన్ ఇప్పుడు తెలంగాణ నుంచి అడుగు ముందుకు వేయడం వెనుక చిదంబర రహస్యం ఏంటి అన్నదే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది నిజానికి పవన్ కళ్యాణ్. కానీ ఇటీవల పరిణామాలతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఎదురైంది .
పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర గురించి తెలంగాణాలో జనసేన బలం తెలిసిన వాళ్ళు ఎవరూ పెద్దగా మాట్లాడరు. కానీ కాంగ్రెస్ నాయకులు గట్టిగానే మాట్లాడుతున్నారు . ముందుగా కరీం నగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గొంతు ఎత్తారు. తెలంగాణ ఉద్యమసాధనలో కీలక పాత్ర పోషించిన జాక్ నేత కోదండరాం సహా తెలంగాణ నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల మీద పోరాటానికి దిగితే ఒక్క క్షణం ఆలోచించకుండా అరెస్ట్ చేస్తున్నారు కదా పవన్ యాత్రకు ఎలా అనుమతి ఇచ్చారు అని పొన్నం అడుగుతున్నారు.
ఒక్క కోదండరాం మాత్రమే కాదు ఇంకా చాలా మంది ప్రజా సమస్యల మీద గళం ఎత్తి నిర్బంధానికి గురయ్యారు. వీళ్లంతా ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ పవన్ యాత్రకు కెసిఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. పవన్ నేతృత్వంలోని జనసేన తెలంగాణాలో తెరాస తో పొత్తుకు ప్రయత్నం చేస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకోసం తెలివిగా పవన్ ని కెసిఆర్ రంగంలోకి దించుతున్నారని కాంగ్రెస్ అనుమానం. అందులో భాగంగానే పవన్ టూర్ అని కెసిఆర్ రాజకీయ ప్రత్యర్ధులు భావిస్తున్నారు. అందుకే పవన్ టూర్ చేస్తుంటే కెసిఆర్ సమాధానం చెప్పాలని అడుగుతున్నారు.