Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ కోవలోనే రాజస్థాన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీచంద్ కృప్లానీ రాహుల్ ను ఉద్దేశించి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీకి తమ పార్టీ బీజేపీ కచ్చితంగా అభినందనలు తెలపాలని కృప్లానీ అన్నారు. బీజేపీకి ఆయన ప్రధాన ప్రచారకుడని, తమ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ ఎవరైనా ఉన్నారంటే అది రాహులేనని కృప్లానీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయిన రాహుల్ కు ప్రధాని మోడీ కూడా అభినందనలు తెలియజేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాదని, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం మాత్రమేనని కృప్లానీ అన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను రద్దుచేయాలని గాంధీజీ జవహర్ లాలా నెహ్రూతో చెప్పారని, కానీ దేశం దురదృష్టం కొద్దీ నెహ్రూ ఆ మాటలను పెడచెవిన పెట్టారని విమర్శించారు. ఇన్నేళ్లకు మహాత్మాగాంధీ కలను సాకారం చేయడానికి రాహుల్ వచ్చారని, కచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే బీజేపీ నేతలు ఎక్కువమంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ…కొందరు నేతలు మాత్రం రాహుల్ గాంధీని తక్కువ అంచనావేయకూడదన్న అభిప్రాయంతో ఉన్నారు. గతంలో కనిపించినంత బలహీనంగా రాహుల్ ఇప్పుడు లేరని, పరిణితి చెందిన రాజకీయవేత్తగా కనపడుతున్నారని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ తన సత్తా ఏమిటో చూపించారని, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవలేకపోయినప్పటికీ…గ తంలో కన్నా మెరుగైన సీట్లు, ఓట్లు సాధిస్తుందని, రాహుల్ ప్రచారమే దీనికి కారణమన్న విశ్లేషణలూ వెలువడుతున్నాయి.