వెన్నెముక లేని కాంగ్రెస్ అంటూ ఫోటో పెట్టి మరీ కేటీఆర్ ఎద్దేవా…!

KTR Satires On Chandrababu Naidu Uttam Kumar Reddy And Rahul

తెలంగాణాలో జోరందుకున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విమర్శనాస్త్రాలని సంధించుకుంటున్నాయి. తెరాస పార్టీ మీద ప్రజకూటమి కి చెందిన రేవంత్ రెడ్డి నిప్పులు చెరుగుతుండగా, దానికంటే ధీటుగా కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అటు ప్రజల మధ్య, ఇటు సోషల్ మీడియాలో ప్రజకూటమి పార్టీలో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్నీ సూక్ష్మంగా పరిగణిస్తూ, తీరైన పోస్టులతో ప్రజకూటమిని ఇరకాటంలో పెడుతున్నాడు. కేటీఆర్ ట్విట్టర్ పేజీని చూస్తే కేటీఆర్ ట్వీట్లు తక్కువ, రే-ట్వీట్లు ఎక్కువగా కనిపిస్తున్నా ప్రతీది ఆలోచన రేకెత్తించేలా ఉంది.నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన ప్రజకూటమి నేతలు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు మరియు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు సంబంధించిన ఒక ఫొటో ని కేటీఆర్ షేర్ చేయడంతో అది ఇప్పుడు అంతటా వైరల్ అవుతుంది.

KTR Satires

ఆ ఫోటో కి కేటీఆర్ రాసిన కామెంట్ కూడా ఆసక్తిగా ఉండి, చూపరులను మరోసారి ఆలోచనలో పడేసేలా ఉంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే ప్రచార బస్సులో రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు లు ముందు సీట్లలో కూర్చొని ఉండగా, వారి వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబడి ఉన్నారు. దీన్ని తనకి అనుకూలంగా మార్చుకున్న కేటీఆర్ తన కామెంట్లో “మహా ఘటియ బంధన్ కి ఓటేస్తే తెలంగాణ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది. సున్నా శాతం కూడా ఆత్మ గౌరవం లేకుండా వెన్నెముక లేనట్లు, పనివాళ్ళలా వెనుక నిల్చున్న కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలి” అని పెట్టడంతో, ఆ ఫోటో ని చూసినవారు తర్కంలో పడిపోతున్నారు. నిజమే కదా మహాకూటమి / ప్రజకూటమి అధికారంలోకి వస్తే సీఎం గా రేసులో మొదటి స్థానంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధమే లేని రాహుల్ గాంధీ మరియు చంద్రబాబు నాయుడు ల వెనుక నిలబడి ఉండడం అవమానకరమే.