దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాటల్లో చమత్కారం ఏ మాత్రం తగ్గలేదు. శిక్ష ఖరారాయ్యేముందు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివపాల్ సింగ్ తో జైల్లో చలివేస్తోంది అని చెప్పగా…అందుకు న్యాయమూర్తి అయితే తబలా వాయించుకో అని బదులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మూడన్నరేళ్ల జైలుశిక్ష, తనను కలవడానికి వారానికి కేవలం ముగ్గురే రావాలని న్యాయమూర్తి ఆదేశించడంపైనా లాలూ తనదైన రీతిలో స్పందించారు. సంక్రాంతి పండుగ వస్తోందని, తమ ఇంట్లో దహీ చుర్రాతో చాలా అట్టహాసంగా పండుగ జరుపుకుంటామని లాలూ న్యాయమూర్తితో చెప్పారు. తనను కలవడానికి వారంలో కేవలం ముగ్గురికే అనుమతిస్తున్నారని, ఈ విషయం గురించి మరోసారి ఆలోచించాలని, ఆ అధికారం మీకు ఉందని న్యాయమూర్తితో అన్నారు.
లాలూ మాటలకు శివపాల్ సింగ్ కూడా దీటుగా సమాధానమిచ్చారు. ఆ దహీ చుర్రా నీకు అందేలా చూస్తానని, కానీ ముగ్గురు విజిటర్లను మించి లోనికి అనుమతించేది లేదని అన్నారు. ఇందుకు లాలూ తాను కూడా న్యాయవాదినని, సుప్రీం, హైకోర్టుల్లో న్యాయవాదిగా తన పేరు నమోదయిందని తెలిపారు. తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్ష వేస్తానని చెప్పారని, కానీ మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించారని అన్నారు. దీనికి న్యాయమూర్తి కూడా చమత్కారంగా సమాధానం ఇచ్చారు. న్యాయవాది అయినప్పటికీ… నువ్వు నీ రిజిస్ట్రేషన్ నెంబరు సమర్పించలేదని, అందుకే నీకు మూడున్నరేళ్ల జైలు శిక్ష వేశానని వ్యాఖ్యానించారు. మొత్తానికి, లాలూ, న్యాయమూర్తిలు తమ హాస్య సంభాషణతో కోర్టు హాల్లో నవ్వులు పూయిస్తున్నారు.