న్యాయవాది గట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గుంజపడుగులోని కుల దేవత గుడి వివాదమే హత్యకు గల ప్రధాన కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మృతుడు వామన్రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంటా శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు. అతడి కాల్ డేటాను అనాలసిస్ చేయగా… ‘గుడి కూలితే వామన్రావు కూలిపోతాడు’ అని శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో క్లిప్ కీలకంగా మారింది. కాగా గుంజపడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంటా శ్రీనివాస్పై గతంలో అనేక కబ్జా, బెదిరింపు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అదే విధంగా అతడు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస)లో పనిచేశాడని వెల్లడించారు. ఇక హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. కుంట శ్రీనివాస్ను త్వరిగతిన అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం సీపీ సత్యనారాయణ సాయంత్రం మీడియా ముందుకు రానున్నారు. ఇక వామన్రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ–1గా కుంట శ్రీనివాస్, ఏ–2గా అక్కపాక కుమార్, ఏ–3గా వసంతరావును పేర్కొంటూ ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.
