కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుత లాక్డౌన్ గడువు బుధవారం (ఈ నెల 9) వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయం ఇచ్చింది.
సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఈ నెల 19 వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.