Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి బలికేసు ప్రధాన నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. రాజశేఖర్ రెడ్డి ఇంట్లో గుర్తించిన రక్తపు చుక్క ఆధారంగా పోలీసులు కేసు చేధించారు. ఈ కేసులో సంచలన విషయాలను పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. రెండేళ్ల కిందటే నరబలికి బీజం పడింది. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్ రెడ్డి, లత దంపతులు వెళ్లారు. అక్కడ వారు ఓ కోయదొరను కలిశారు. ఆరోగ్యం బాగుపడాలన్నా..ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా…నరబలి ఇవ్వడమే మార్గమని ఆ కోయదొర, మాంత్రికుడు ఈ దంపతులకు చెప్పాడు. ఇక అప్పటినుంచీ నరబలి కోసం రాజశేఖర్ దంపతులు ప్రయత్నాలు ప్రారంభించారు. బలిచ్చే పిల్లల కోసం తీవ్రంగా వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో గత నెల 31న సుధాకర్ రెడ్డి సోదరుడు బోయగూడలో ఫుట్ పాత్ పై పడుకున్న వారి నుంచి ఓ చిన్నారిని అపహరించాడు. చార్మినార్ లోని ఓ బాబా కనుసన్నల్లో పూజలు చేయించారు. నరబలి తర్వాత రక్తంమరకలున్న దుస్తులను సోదరులిద్దరూ బండ్లగూడ మూసీ సమీపంలో చెట్లపొదలో పడేశారు. చిన్నారి మొండాన్నిప్రతాపసింగారం వద్ద మూసీనదిలో పడేశారు. రాజశేఖర్ ఇంట్లో దంపతులిద్దరూ నగ్న పూజలు చేశారు. పాప తలపై చంద్రుని వెలుగు, సూర్యకిరణాలు పడాలని చెప్పడంతో చిన్నారి తలను డాబాపై ఉంచారు.
రాజశేఖర్ కు మూఢవిశ్వాసాలు ఎక్కువగా ఉండడంతో క్షుద్రపూజలు చేస్తే భార్య ఆరోగ్యం నయమవుతుందని అతను భావించాడు. భార్య సహకారంతోనే రాజశేఖర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని సీపీ తెలిపారు. రాజశేఖర్ ఇంట్లో లభించిన రక్తపు మరకలు ఆడశిశువువేనని డీఎన్ ఏ పరీక్షలో నిర్ధారణ అయిందన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు నిందితులు ప్రయత్నించారని తెలిపారు. ఈ కేసు విచారణ సందర్భంగా 100 సీసీ కెమెరాలను పరిశీలించామని, బోయగూడలో అపహరించి తీసుకొచ్చిన చిన్నారి ఎవరనే విషయం ఇంకా తెలియాల్సిఉందని అన్నారు. ఈ కేసు చేధనకు 45మందిని విచారించామని, సుమారు 15 రోజుల పాటు రాత్రింబవళ్లు పనిచేశామని వెల్లడించారు. శాస్త్ర సాంకేతికత రోజురోజుకూ ఇంతగా అభివృద్ధి చెందుతున్నా..ఇంకా ఇలాంటి క్షుద్రపూజలు, నరబలిలు నమ్మి ఘాతుకాలకు పాల్పడడం బాధాకరమన్నారు.