బంగారం కోసం ప్రియురాలి చంపిన వ్యక్తి

బంగారం కోసం ప్రియురాలి చంపిన వ్యక్తి

ప్రియురాలిని చంపి ఆమె బంగారం అమ్మి భార్యతో షికార్లు కొట్టిన ప్రబుద్ధుడి బాగోతం బయటపడింది. అప్పులపాలైన ప్రియుడు ప్రియురాలి మెడలో బంగారం కొట్టేసేందుకు ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తేలింది. భర్తకు సహకరించినందుకు భార్య కూడా కటకటాలపాలైంది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమృతలూరు మండలం ఇంటూరుకి చెందిన పోతర్లంక శ్రీనివాసరావుకి చెరుకుపల్లిలోని కొత్తపేటకు చెందిన కొటారి సామ్రాజ్యంతో 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది.

చెడువ్యసనాలకు బానిసైన శ్రీనివాసరావు ఇంటూరులో అప్పులు చేసి బాపట్లలోని బెస్తపాలేనికి మకాం మార్చాడు. గత నెల 3వ తేదీన సామ్రాజ్యం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో చెరుకుపల్లి వెళ్లి ఆమెను బైక్ ఎక్కించుకుని నిజాంపట్నం మండలం కోనఫలం గ్రామానికి తీసుకెళ్లాడు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఆమెను ఎక్కించుకుని తిరుగుప్రయాణమయ్యాడు. అప్పటికే అప్పులతో సతమతమవుతున్న శ్రీనివాసరావు కన్ను సామ్రాజ్యం మెడలో ఉన్న బంగారంపై పడింది.

ఆమెను అంతమొందించి బంగారం దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆమెకు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను మురుగుకాల్వలో ముంచి దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న ఐదున్నర సవర్ల బంగారం, వెండి, రూ.400 నగదు కూడా తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి వెళ్లి భార్య పద్మావతికి విషయం చెప్పాడు. బంగారం అమ్మగా వచ్చిన రూ.1.25 లక్షలతో కొద్దిగా అప్పులు తీర్చి ఎవరికీ అనుమానం రాకుండా ఊరికి చెక్కేశారు.

రాష్ట్రంలో పలుచోట్ల తిరిగారు. నెల్లూరు, గిద్దలూరు, గుంటూరు, విజయవాడ తదితర చోట్ల తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే హత్య జరిగిన మరుసటి రోజే సామ్రాజ్యం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాగైనా దొరికిపోతామని భావించిన శ్రీనివాసరావు వీఆర్వో వద్ద లొంగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి బంగారం రికవరీ చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. భర్త నేరంలో పాలు పంచుకున్నందుకు భార్య కూడా జైలుపాలైంది.