‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు క్రిష్ తాజాగా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్తో ‘మణికర్ణిక’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని 2019 జనవరి 25న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని చెబుతున్న చిత్ర యూనిట్ సభ్యులు విడుదలకు ఇంత సమయం ఎందుకు కేటాయిస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే మణికర్ణిక చిత్రంలోని కొన్ని సీన్స్ను రీ షూట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దాదాపు 4 కోట్ల ఖర్చుతో రీ షూట్ను చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఈ విషయమై స్పందిస్తూ.. మణికర్ణిక చిత్రం రీ షూట్ గురించి మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ తేల్చి పారేశాడు. సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యింది. సినిమా రషెస్ నేను చూశాను. చాలా అద్బుతంగా చిత్రం వచ్చింది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. చిత్రంలోని ప్రతి సీన్లో కూడా జాన్సీ లక్ష్మిబాయి గొప్పదనంను దర్శకుడు చూపించాడు అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉంది. ఆ కారణంగానే సినిమా ఆలస్యం అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత మొదలు అయిన ‘ఎన్టీఆర్’ మూవీని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు క్రిష్ ఏర్పాట్లు చేస్తున్నాడు. అంటే మణికర్ణిక విషయంలో ఎంతగా ఆలస్యం అవుతుందో చెప్పనక్కర్లేదు.