కిరోసిన్‌ పోసుకొని వివాహిత ఆత్మహత్య

కిరోసిన్‌ పోసుకొని వివాహిత ఆత్మహత్య

క్షణికావేశంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని లింగాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శీలం రవి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గన్నవరపు వాణి(35) ఆర్థిక పరిస్థితులు మనసులో పెట్టుకొని తన భర్త చిరంజీవితో బుధవారం సాయంత్రం గొడవపడి క్షణికావేశంతో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసింది.

కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. వాణికి భర్త చిరంజీవి, ముగ్గురు కుమార్తెలు వైష్ణవి, తేజస్విని, అక్షర ఉన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు.