‘గిరిజా క్షమించు, అమృతా అమ్మదగ్గరికి రా’

‘గిరిజా క్షమించు, అమృతా అమ్మదగ్గరికి రా’

సంచలనం సృష్టించిన మిర్యాలగూడ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీ రావు శనివారం (మార్చి 7) అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యా భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆర్యవైశ్యా భవన్‌లో క్లూస్‌ టీంతో తనిఖీలు చేయించారు. భవనంలోని ఓ గదిలో మారుతీ రావు మంచంపై విగతజీవిగా పడి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యా, సహజ మరణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి, ఆత్మహత్యగా నిర్ధారించారు.

మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, కేసుల ఒత్తిడి కారణంగానే మారుతీ రావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ‘గిరిజా క్షమించు, అమృతా అమ్మదగ్గరికి రా’ అని రాసి ఉంది.

మారుతీ రావు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అక్కడ నుంచి ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులు నేరుగా మిర్యాలగూడలోని నివాసానికి తరలించారు. మారుతీరావు మరణవార్త విని ఆయన భార్య గిరిజ బోరున విలపించారు.