‘‘ఉత్తర్‌ప్రదేశ్‌ రక్షణే ధ్యేయం’’

‘‘ఉత్తర్‌ప్రదేశ్‌ రక్షణే ధ్యేయం’’

బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ జిల్లా పంచాయత్‌ ఎన్నికల్లో తాము పోటీచేయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నామని, అందుకే స్థానిక ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మాయావతి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నానన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. ‘‘ఉత్తర్‌ప్రదేశ్‌ రక్షణే ధ్యేయం’’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లా పంచాయత్‌ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గాలపై దృష్టి సారించి, కేడర్‌ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాయావతి వెల్లడించారు. నిజానికి, ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే పోటీ చేసే విషయం గురించి ఆలోచించే వాళ్లమని, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా మాయావతి నిర్ణయంపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ, అధికార బీజేపీకి సహకరించేందుకే మాయావతి పంచాయత్‌ ఎన్నికల బరిలో నిలవడం లేదని ఆరోపించింది.

ఈ మేరకు… యూపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా… ‘‘బీజేపీకి ఎప్పుడు సాయం కావాలన్నా మాయావతి ఈ విధంగా ఎన్నికల నుంచి తప్పుకొంటూ ఉంటారు. జిల్లా పంచాయత్‌ ఎన్నికల్లో పోటీ చేయం అన్న ప్రకటన కూడా ఈ కోవకు చెందినదే’’ అని విమర్శించారు. ఇందుకు స్పందనగా… బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లా పంచాయతీ సభ్యులు చచ్చినట్లు తమ పార్టీలో చేరతారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి బదులిచ్చారు. కాగా జూలై 3న యూపీలో జిల్లా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా… ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 3 వేల మంది సభ్యులు జిల్లా పంచాయతీ చీఫ్‌లను ఎన్నుకోనున్నారు.