రేవంత్‌ రెడ్డి సవాల్‌పై స్పందించిన పువ్వాడ

రేవంత్‌ రెడ్డి సవాల్‌పై స్పందించిన పువ్వాడ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విసిరిన సవాలుపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు. మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తెలిపారు. భూములు కబ్జా చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏ విచారణకు అయినా సిద్ధమేనని వెల్లడించారు. సీబీఐతోనైనా విచారణ చేయించుకోవచ్చని సూచించారు

రేవంత్‌ రెడ్డి ఒక ఐటమ్‌ అని మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చిన నువ్వా.. నా గురించి మాట్లాడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తూ రాజకీయాలు చేస్తున్నాడని, సుపారీ ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడని రేవంత్‌పై మండిపడ్డారు. అలాగే ఈనెల 29 తర్వాత సాయి గణేష్ ఘటనపై మాట్లాడుతానని.. కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడలేనని అన్నారు.

కాగా అంతకముందు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌పై రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి పువ్వాడ ఓ సైకోనని, అతనికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. పువ్వాడ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈడీ కేసులు, కాంగ్రెస్‌ కార్యకర్తల మృతి, మమత కాలేజీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని అన్నారు. దమ్ముంటే పువ్వాడే తనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాలని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.

మంత్రి పువ్వాడ వేధింపులు తాళలేకే బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్‌ ఆరోపించారు.మంత్రి పువ్వాడ తమ కులాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించాడు. మంత్రి వల్ల కమ్మ కులానికి చెడ్డపేరు వస్తుందని, అతన్ని కులం నుంచి బహిష్కరించాలని కమ్మపెద్దలను రేవంత్‌ కోరారు.