Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ నిర్మాత దిల్రాజుపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఎన్నో అద్బుతమైన చిత్రాలను నిర్మించి టాలీవుడ్ నెం.1 నిర్మాత అనిపించుకున్న దిల్రాజుపై కేసు నమోదు అవ్వడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా, నిజంగానే దిల్రాజుపై కేసు నమోదు అయ్యింది. చాలా సంవత్సరాల క్రితం ఆయన నిర్మించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే సినిమా వివాదం కారణంగా దిల్రాజు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. దశరధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా కథ తనదంటూ రచయిత్రి శ్యామలారాణి కేసు నమోదు చేశారు.
కొన్ని సంవత్సరాల ముందు తాను రచించిన నవల ‘నా మనస్సు కోరింది నిన్నే’ను కాపీ చేసి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారని, తన అనుమతి లేకుండా తన కథను కాపీ చేయడం కాపీరైట్ యాక్ట్ కిందకు వస్తుందంటూ ఆమె మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. త్వరలోనే దిల్రాజును విచారించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పది సంవత్సరాల క్రితం మూవీపై ఇప్పుడు కేసు ఏంటో అంటూ సినీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ఎక్కడకు దారి తీస్తుందో అనే ఆందోళనలో దిల్రాజు సన్నిహితులు ఉన్నారు. శ్యామలా రాణితో దిల్రాజు ఏమైనా ఒప్పందం చేసుకుంటాడా లేక కేసును ఎదుర్కొంటాడా అనేది కూడా చూడాలి.