వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లు ఇవ్వడం తన చేతుల్లో లేదని చెప్పిన తర్వాత అప్పటి వరకూ వైసీపీకి అండగా నిలిచిన ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. అసలు వల్ల కాదని నువ్వంటున్నావని కానీ మాకు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం ఉందని అనడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఎందుకంటే నిన్నమొన్నటి వరకూ చంద్రబాబుని ద్వేషించిన ముద్రగడ ఇప్పుడు సడన్గా బాబు స్టాండ్ తీసుకోవడం వెనుక జగన్ వ్యాఖ్యలేనా ? లేదా ఇంకేదైనా కారణం ఉందా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
అంతే కాక ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు కాపు నేతలను పార్టీ సమన్వయకర్తలుగా నియమించారని… పాదయాత్రలో మీ హంగు ఆర్భాటాల కోసం ఒక్కొక్కరితో రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిస్తున్నారని మీ పాదయాత్ర కోసం కాపు కుటుంబాలు నాశనమైపోవాలా? అని ప్రశ్నించారు. పాదయాత్ర కోసం మీరు కనీసం ఒక్క రూపాయైనా ఖర్చు చేస్తున్నారా? అని అడిగారు. అంతా సమన్వయకర్తలపై పెట్టేసి, వారి జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అడుగడుగుకు ఒక ఫ్లెక్సీ, గజానికో పెద్ద బోర్డు, పది గజాలకు ఒక గేటు… ఇంత ఖర్చును మా కాపు నేతలు భరించాలా? అని ముద్రగడ ప్రశ్నించారు. మీ పాదాల కిందో, మరొకరి పాదాల కిందో కాపు జాతి అనునిత్యం బతకాలా? మీ మోచేతి నీళ్లు తాగుతూ జీవించాలా? అని ప్రశ్నించారు.