చీరాలలో దారుణమైన హత్య

చీరాలలో దారుణమైన హత్య

చీరాలలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పిల్లనిచ్చిన మామే అల్లుడిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా గొడ్డలితో వెంటాడి మరీ నరికేశాడు. చీరాలలోని సాయి కాలనీలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానిక రామ్‌నగర్‌ ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో మోటా దిలీప్‌ (27) అనే వ్యక్తి 8ఏళ్ల క్రితం రెబక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మనస్పర్థల కారణంగా దంపతులిద్దరూ కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రెబక పెద్దనాన్న పీరిగ వెంకటేశ్వర్లు సోమవారం దిలీప్‌ను తన ఇంటికి రప్పించి మాట్లాడాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడంతో ఆవేశానికి గురైన దిలీప్ వెంకటేశ్వర్లుపై సీసాతో దాడి చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు తమ్ముడు పీరిగ చిన్న(రెబక తండ్రి) తన కొడుకులు రవితేజ, చెంగయ్య, మరో ఇద్దరు కలిసి దిలీప్‌ను హతమార్చేందుకు గొడ్డళ్లు తీసుకుని వెంబడించారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు దిలీప్ సాయి కాలనీలోకి పరుగులు తీశాడు. ఓ దుకాణం వద్ద దిలీప్‌ను పట్టుకున్న మామ గొడ్డలితో అతడి తల, చేతులపై నరికాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన దిలీప్ అక్కడే మృతి చెందాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తమ వాహనంలోనే బాధితుడిని ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ దిలీప్ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న దిలీప్ తల్లి మణెమ్మ, ఆమె బంధువులు ఆస్పత్రి వద్దకు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఎండీ ఫిరోజ్‌ తెలిపారు.