మోడీకి కష్టమే….కాంగ్రెస్ హవా !

ఎలా యినా వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ప్రధాని పీఠం ఎక్కాలని చూస్తున మోడీకి మరోసారి అధికారం అందడం కష్టమేనని తాజా సర్వేలో తేలింది. ఇండియా టుడే- కార్వీ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే ప్రకారం దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే, యూపీయే కూటములకు చెరో 44 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని తెలిపింది. మోదీ మళ్లీ అధికారంలోకి రావడం గగనమేనని, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, వైసీపీ, బీజేడీలు మద్దతు ఇచ్చినా ప్రభుత్వం ఏర్పాటు కష్టమేనని సర్వే వెల్లడించింది. అదే సమయంలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ మహా కూటమిలో మెహబూబా ముఫ్తీ, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌లు చేరితే దానికి అధికారం దక్కుతుందని తేల్చింది. మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్, పళనిస్వామి, జగన్, నవీన్‌ పట్నాయక్‌లు ఎన్డీయేతో కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆధిక్యం మాత్రం ఎన్డీఏకి లభించకపోవచ్చని సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 92 లోక్‌సభ నియోజకవర్గాల్లోని సర్వే నిర్వహించిన ఇండియా టుడే 13,179 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి దాని ద్వారా ఈ ఫలితాలను వెల్లడించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 336 ఎంపీ స్థానాలను దక్కించుకున్న ఎన్డీయే ఈసారి మాత్రం 237 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. అలాగే, ఇతర పార్టీలు, స్వతంత్రులకు కలిపి 34 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, వారంతా ఎన్డీయేతో కలుస్తారనుకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు ఒక స్థానం తక్కువవుతుందని పేర్కొంది.

మోడీకి కష్టమే....కాంగ్రెస్ హవా ! - Telugu Bullet

ఇదే సమయంలో కాంగ్రెస్ సారధ్యంలో యూపీఏ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, గత ఎన్నికల్లో 59 స్థానాలకు పరిమితమైన యూపీఏ, కొత్త మిత్రులతో కలిసి ఈసారి 272 స్థానాలను సాధించగలుగుతుందని సర్వేలో వెల్లడయ్యింది.ఎన్డీయేలో ఏ పార్టీ కొత్తగా చేరకుండా, తృణమూల్‌, ఎస్పీ, బీఎస్పీలు మహాకూటమిలో చేరితే ఎన్డీయే 219, యూపీయే 269 స్థానాలు దక్కుతాయని, ఇతరులు 55 సీట్లు దక్కించుకుంటారని తేలింది. అయితే, ఉత్తరాదిలో ఎన్డీయే బలంగా ఉన్నట్టు స్పష్టమైంది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైనా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం తన బలం నిలబెట్టుకుంటుందని సర్వే ద్వారా వెల్లడయ్యింది. ఉత్తరాది రాష్ట్రాల్లోని 40 శాతం ఓట్లు బీజేపీకి దక్కుతాయట. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం 18% ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని, ఇక్కడ యూపీఏకి 43 శాతం, ఇతరులు 39 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సీట్లపరంగా దక్షిణాదిలో యూపీయే 78 స్థానాల్లో నెగ్గుతుంది. తూర్పు రాష్ట్రాల్లో అధికార కూటమికి 37 శాతం, యూపీయేకి 25 శఆతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. కీలకమైన యూపీలో మాత్రం కాషాయ పార్టీకి భారీ షాక్ తగలనుంది. గత ఎన్నికల్లో మిత్రపక్షం అప్నాదళ్‌తో కలిసి 73 స్థానాలు గెలుపొందిన బీజేపీకి, ఈసారి అక్కడ ఆ పరిస్థితి లేదు. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడటంతో 57 సీట్లు వారికి, ఎన్డీఏకి 25, యూపీఏకి 4 దక్కుతాయని వెల్లడయ్యింది. బిహార్‌లో మాత్రం బీజేపీ-జేడీయూ కూటమికి 35 సీట్లు లభించే అవకాశం ఉన్నట్టు సర్వేలో తేలింది.