విద్యార్థినులు పక్కాగా జడ వేసుకోవాలి

విద్యార్థినులు పక్కాగా జడ వేసుకోవాలి

‘విద్యార్థినులు పక్కాగా జడ వేసుకోవాలి.. జుట్టు విరబూసుకుని రాకూడదు.. సెల్ఫీలు తీసుకోవడం నిషేధం.. డ్రస్ కోడ్ తప్పనిసరి’ ఈ నిబంధనలు తాలిబన్లు ఆక్రమించుకున్న అఫ్గనిస్థాన్‌లో కాదు.. సాక్షాత్తు బిహార్‌లోనే ఓ మహిళా కళాశాల ఈ రకమైన ఆంక్షలు విధించింది. భాగల్‌పుర్‌లోని సుందరావతి మహిళా మహా విద్యాలయం వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. కళాశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకుని కనిపించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, ఈ ఏడాది ఇంటర్‌లో చేరిన బాలికలకు ప్రత్యేక వస్త్రధారణను నిర్దేశించింది.కళాశాల ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అమ్మాయిలు లూజ్‌ హెయిర్‌తో వస్తే వారిని అనుమతించబోమని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌. రమన్‌ సిన్హా స్పష్టం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం నిర్ణయంపై విద్యార్థినులు మండిపడుతున్నారు. సైన్స్, కామర్స్, ఆర్ట్స్‌ మూడు విభాగాలలో ప్రస్తుతం 1,500 మంది విద్యార్ధినులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్‌ కొత్త డ్రెస్‌ కోడ్‌ను నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ సూచించిన దుస్తులనే ధరించాలని కళాశాల యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. చలికాలంలో రాయల్ బ్లూ బ్లేజర్ లేదా చలికోటు ధరించాలని సూచించింది. వీటిని ఎవరైనా అతిక్రమించి డ్రెస్‌కోడ్‌ లేకుండా, జడ వేసుకోకుండా వస్తే అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి.

ఇదో తుగ్లక్ నిర్ణయమని ఆర్జేడీ విద్యార్ధి విభాగం ధ్వజమెత్తింది.అయితే, ఈ నిర్ణయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ సమర్ధించుకున్నారు. డ్రస్ కోడ్‌పై ఉత్తర్వులు జారీచేశామని, వీటిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అంతేకాదు, దీనిపై మీడియా, కొంత మంది విద్యార్ధినులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని ఆయన ఉద్ఘాటించారు.