45 కోట్లు అందుకున్న ఎన్టీఆర్‌ రామ్‌చరణ్‌

45 కోట్లు అందుకున్న ఎన్టీఆర్‌ రామ్‌చరణ్‌

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించాడు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ మల్టీస్టారర్‌ సినిమాను ఎప్పుడు వీక్షిద్దామా అని సినీ లవర్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ జోరుగా ప్రమోషన్లు చేస్తోంది. ఈ క్రమంలో ఇందులో నటించిన ప్రధాన తారాగణానికి ఎంత రెమ్యునరేషన్‌ ముట్టిందన్న విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్‌చరణ్‌ ఏకంగా రూ.45 కోట్లు తీసుకున్నాడట.

కొమురం భీమ్‌గా నటించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం 45 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక పాత్రలో నటించిన బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని అతడికి పాతిక కోట్లు ఇచ్చారట. రాజమౌళి సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉవ్విళ్లూరుతూ చివరకు ఆర్‌ఆర్‌ఆర్‌లో ఛాన్స్‌ దక్కించుకున్న ఆలియా భట్‌ రూ.9 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఒక కళాఖండంగా మార్చిన డైరెక్టర్‌ రాజమౌళి లాభాల్లో 30 శాతం వాటా తీసుకోవడానికి సిద్ధమయ్యారని వినికిడి. సినిమా బడ్జెట్‌లో దాదాపు సగం వరకు ఈ రెమ్యునరేషన్‌లకే కేటాయించినట్లు కనిపిస్తోంది.