కేసీఆర్ కి షాకిచ్చిన పట్నాయక్….బాబుకే వోటు…!

Odisha Cm Naveen Patnaik Give Shock To Cm KCR

జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల సహకారంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన తొలి ప్రయత్నం ఒడిశా నుంచే ఆయన ప్రారంభించారు. ఆదివారం నాడు భువనేశ్వర్ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఒడిశా ముఖ్యమంత్రి, బీజేపీ అధినేత నవీన్ పట్నాయక్‌ను కలిశారు. ఆయనతో కూటమి ఏర్పాటుపై చర్చించిన అనంతరం ఇద్దరూ మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన కలిసి చర్చించి వచ్చిన రెండు రోజులకే కీలక పరిణామం చోటు చేసుకుంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు పోరాటానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని నవీన్ పట్నాయక్ తన ప్రతినిధి ద్వారా కబురు పంపడం చర్చలకు తావిస్తోంది. బీజేడీ ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్‌ను అమరావతికి పంపిన పట్నాయక్ బాబుకు మద్దతు తెలిపారు. మంగళవారం అమరావతికి వచ్చిన బీజేడీ ఎంపీ, సీఎం చంద్రబాబును కలిసి తమ నేత అభిమతాన్ని వివరించారు. ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తోన్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల స్థానంలో పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతోన్న ఏపీ చంద్రబాబు డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాసటగా ఉంటామని ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. తాను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని తన లేఖలో నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. అలాగే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపైనా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోసారి బీజేపీ రాకూడదన్నది తమ సీఎం అభిప్రాయమని, ఈవీఎంలకన్నా, బ్యాలెట్ పేపర్లపైనే తమకు ఎక్కువ విశ్వాసముందని సౌమ్యా రంజన్ పట్నాయక్ అన్నారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే అంశాన్ని కంప్యూటర్ చిప్‌లను తయారు చేసే మేనేజర్ల చేతిలో పెట్టడం ప్రమాదకరమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సౌమ్యా రంజన్ కూడా అంగీకరించారు. వీరిద్దరి భేటీలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా పాల్గొన్నారు.