పెరగనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు

పెరగనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు

పెట్రోల్ రేటు గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉంటూ వస్తోంది. డీజిల్ కూడా ఇదే దారిలో నడుస్తోంది. అయితే ఇకపై ఇలా జరగకపోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారంలో ముగియనున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ తన నివేదికలో పేర్కొంది. దీంతో వాహనదారులపై మాత్రమే కాకుండా సామాన్యులపై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. రష్యా ఆయిల్ సరఫరాకు అడ్డంకులు కలిగించొచ్చనే అంచనాలు ఇందుకు కారణం. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు పైకి చేరింది. 2014 నుంచి చూస్తే క్రూడ్ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడ గమనార్హం. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఫ్యూయెల్ రేట్లు, ముడి చమురు రేట్లకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ పేర్కొంటోంది.

ఈ గ్యాప్‌ను భర్తీ చేయాలంటే పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 9 మేర పెంచాల్సి ఉందని వివరించింది. దీంతో వచ్చే వారం నుంచి పెట్రోల్ ధర మోత ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. మార్చి 7న ఉత్తర ప్రదేశ్ ఏడో విడత ఎన్నికలు ముగుస్తాయి. ఈ ఎన్నికల ముగింపు తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు ప్రారంభం కావొచ్చని జేపీ మోర్గాన్ నివేదిక పేర్కొంటోంది.మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి కంపెనీలు ఒక్కో లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ. 5.7 చొప్పున నష్టపోతున్నాయి. దీనికి సాధారణ మార్జిన్ లీటరుకు రూ. 2.5 పరిగణలోకి తీసుకోలేదు. ఈ నష్టాలను భర్తీ చేసుకోవాలంటే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 9 మేర పెంచాల్సి ఉంటుంది. ఇకపోతే క్రూడ్ ధరలు 120 డాలర్ల నుంచి 150 డాలర్లకు కూడా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇది జరిగితే మాత్రం ఇంధన ధరలు మరింత పైకి కదలే అవకాశం ఉంది. ఇప్పటికే ధరల పెంపుతో సతమతమౌతున్న ప్రజలపై మరోసారి ప్రభావం పడబోతోంది.