బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

అత్యాచారానికి గురైన మైనర్ బాలిక ఇంటికి కేసు విచారణ పేరుతో వెళ్లి మాయమాటలు చెప్పి పోలీస్ కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరు నెలలుగా బాలికపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడటంతో బాధితురాలు గర్బం దాల్చింది. ఈ విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలియడంతో కానిస్టేబుల్‌ను నిలదీశారు. పెళ్లి చేసుకోడానికి నిరాకరించిన అతడు.. అబార్షన్ చేయించుకోవాలని చెప్పి కొంత మొత్తం ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో వెలుగుచూసింది.

ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారం.. కానిస్టేబుల్ శివరాజ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి గత ఆరు నెలలగా బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. అయితే, బాధిత బాలికపై రెండేళ్ల కిందట అత్యాచారం జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఈ ఘటనపై పోక్సో కింద కేసు నమోదుచేశారు. ఈ కేసు విచారణ పేరు చెప్పి బాధితురాలి ఇంటికి కానిస్టేబుల్ శివరాజ్ తరుచూ వస్తుండేవాడు. ఈ క్రమంలోనే బాలికను లొంగదీసుకున్నాడు.

ఆరు నెలల నుంచి బాలికపై లైంగిక చర్యలకు పాల్పడటంతో గర్భం దాల్చింది. కుమార్తెలో మార్పును గమనించిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో విషయం బయటపెట్టింది. శివరాజ్ తనను పెళ్లిచేసుకుంటానని చెప్పాడని వెల్లడించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు శివరాజ్‌ని నిలదీయడంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అంతేకాదు, అబార్షన్ చేయించుకోవాలని, ఖర్చుల కింద ఆ కుటుంబానికి రూ. 35,000 ఇచ్చాడు.

దీంతో ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.శివరాజ్‌పై పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాధిత బాలిక మంగళవారం పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది. దర్యాప్తులో పూర్తి వాస్తవాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు.