ప్ర‌భాస్ పౌరాణిక చిత్ర‌ం

ప్ర‌భాస్ పౌరాణిక చిత్ర‌ం

బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకున్న ప్ర‌భాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ ద‌ర్శ‌కులు తెగ‌ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ‘తానాజీ’ ద‌ర్శ‌కుడు ఔంరౌత్‌తో క‌లిసి ప్ర‌భాస్ సినిమా చేయ‌నున్నార‌నేది తెలిసిన విష‌య‌మే. అయితే ఈ చిత్రం ఎలాంటి నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంద‌నే స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం 7.11 నిమిషాల‌కు ఈ చిత్ర టైటిల్‌ను పోస్ట‌ర్‌తో స‌హా విడుద‌ల చేశారు. ప్ర‌భాస్ 22వ సినిమాకు “ఆదిపురుష్” అనే పేరును ఖ‌రారు చేస్తున్న‌ట్లు హీరో ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కుడు ఓంరౌత్ ప్ర‌క‌టించారు. “చెడుపై మంచి సాధించే విజ‌యాన్ని పండ‌గ ‌చేసుకుందాం” అనేది క్యాప్ష‌న్‌. ఈ పోస్ట‌ర్‌లో హ‌నుమంతునితోపాటు ఎంద‌రో మునులు కూడా ఉన్నారు. దీన్ని బ‌ట్టి ఇది పౌరాణిక చిత్ర‌మ‌ని ఈజీగా తెలుస్తోంది.

త్రీడీలో రూపుదిద్దుకోనుండ‌టం ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అనువాదం చేయ‌నున్నారు. టీ సిరీస్ నిర్మిస్తోంది. సుమారు రూ.500 కోట్ల బ‌డ్జెట్‌ కేటాయించిన‌ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ ఈ ఏడాదే ప్రారంభం అవుతుండ‌గా, వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తామంటున్నారు. ప్ర‌భాస్ 22 వ సినిమాలో రాముడిగా లేదా విష్ణువుగా క‌నిపించ‌నున్నార‌ని అభిమానులు జోస్యం చెప్తున్నారు. ఇదే నిజ‌మైతే ప్ర‌భాస్ కెరీర్‌లో ఈ చిత్రం ప్ర‌త్యేకంగా నిలిచిపోనుంది. మ‌రోవైపు లాక్‌డౌన్‌లోనూ సినిమా అనౌన్స్ చేసి త‌మ‌ను స‌ర్‌ప్రైజ్ చేశారంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.