సహాయం చేస్తున్న రజనీ కుమార్తె

సహాయం చేస్తున్న రజనీ కుమార్తె

తమిళనాడులో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ దశలో సినీ ప్రముఖులు వైరస్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు తమిళనాడు ముఖ్యమంత్రికి విరాళాలు అందించారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె తన వొంతు సహాయం చేశారు.రెండో దశలో కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తోంది.

దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ.. కోవిడ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళ సినీ తారలు అక్కడి కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. కరోనా బాధితులకు సహాయం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వొంతు సహాయం అందిస్తున్నారు.

ఇప్పటికే హీరోలు సూర్య, కార్తీ తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి.. రూ.కోటి విరాళంగా ఇవ్వగా.. హీరో అజిత్, దర్శకుడు మురగదాస్ రూ.25 లక్షల సహాయం అందించారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. సీఎం స్టాలిన్‌కి కలిసి ఆమె.. కరోనా బాధితుల సహాయం కోసం రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమెతో పాటు మామగారు, భర్త విశాగన్, ఆయన సోదరి కూడా ఈ పనిలో పాలు పంచుకున్నట్లు పేర్కొన్నారు.

కాగా, సౌందర్య సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు.. తన తండ్రి రజనీకాంత్‌కి సంబంధించిన సమాచారాన్ని ఆమె ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రజనీకాంత్ చెన్నైకి వెళ్లి అక్కడ రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా సౌందర్యనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రజనీకాంత్ వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని తెలిపిన ఆమె.. ప్రతీ ఒక్కరు ఎటువంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.