బాలీవుడ్ లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

బాలీవుడ్ లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

కెరటం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఢిల్లీ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగుతోపాటు, కన్నడ, తమిళ్‌, హిందీ భాషల్లోనూ నటించారు. తన అందం, నటనతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రకుల్‌ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్‌ వద్ద ఢీలా పడటంతో సినిమాల ఎంపిక విషయంలో కాస్తా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు బాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే ఈవేవి ఆమె కెరీర్‌పై ప్రభావం చూపించలేదు.

ఇక రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే బాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడు తళుక్కుమంటున్నారు. అందులో భాగంగా ఈ భామకు బీ టౌన్‌ నుంచి మరో అవకాశం వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘మేడే’ అనే థ్రిల్లర్‌ డ్రామా చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు స్టార్ హీరో అజయ్ దేవగన్ దర్శకత్వం వహించనున్నాడు. డైరెక్షన్‌తో పాటు ఓ కీలక పాత్రలోనూ అజయ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంతో చాలా సంవత్సరాల తరువాత సీనియర్ స్టార్ అమితాబ్, అజయ్‌లు కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.