చరణ్‌ ఎమోషనల్‌

చరణ్‌ ఎమోషనల్‌

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రౌద్రం..రణం..రుధిరం’ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సినీప్రియులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో జక్కన్న టీమ్‌ ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది.

ఇటీవల ముంబైలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించిన చిత్ర యూనిట్‌.. తాజాగా సోమవారం చెన్నైలో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌పై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తారక్‌లాంటి నిజమైన బ్రదర్‌ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్‌ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ‘ఎన్టీఆర్‌ను, నన్ను కలిసి సినిమా తీసినందుకు రాజమౌళికి థ్యాంక్స్‌. నిజ జీవితంలో నాకు, తారక్‌కి ఒక ఏడాది తేడా.

కానీ తనది సింహంలాంటి పర్సనాలిటీ.. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం.తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తారక్‌లాంటి నిజమైన బ్రదర్‌ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్‌. తారక్‌కి థ్యాంక్స్‌ చెబితే మా బంధం ఇక్కడితో ముగిసిపోద్ది అనేది నా భావన.. నేను చనిపోయేవరకు ఆ బ్రదర్‌ హుడ్‌ని నా మనసులో పెట్టుకుంటాను’అంటూ చరణ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చాడు. ఆ సమయంలో స్టేజ్‌ కింద రాజమౌళి పక్కన కూర్చున్న తారక్‌.. చెర్రీ మాటలను ఆస్వాదిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికొస్తే.. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటించారు. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.