తెలంగాణ సమాజానికి విముక్తి కల్పిస్తా

తెలంగాణ సమాజానికి విముక్తి కల్పిస్తా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో బందీ అయిన తెలంగాణ సమాజానికి విముక్తి కల్పిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీతక్క మంగళవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయానికి వచ్చి రేవంత్‌కు అభినందనలు తెలిపారు. సమ్మక్క–సారక్క ఆలయం నుంచి ప్రత్యేక పూజలు చేసిన బొట్టు పెట్టి, రక్ష కట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించి సోనియాగాంధీ తెలంగాణను ఇస్తే ఆ తెలంగాణ దోపిడీ దొంగల పాలైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఇక నుంచి కంటిమీద కునుకు లేకుండా చేస్తానని అన్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ప్రకటించగానే విపక్ష నేతలకు ప్రగతిభవన్‌ తలుపులు తెరుచుకున్నాయని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని పేదల సమస్యలపై పోరాటం చేసేందుకు ఒక అవకాశంగా ఉపయోగించుకుంటానన్నారు.