పంత్‌ను మరో ప్రతిష్టాత్మక అవార్డు

పంత్‌ను మరో ప్రతిష్టాత్మక అవార్డు

టీమిండియా స్టార్‌ వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌ను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2021వ సంవత్సరానికి గాను ఈస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో ఉత్తమ టెస్ట్‌ బ్యాటింగ్‌ అవార్డుకు పంత్‌ ఎంపికయ్యాడు. 2020-21 బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన గబ్బా టెస్ట్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌కు గాను పంత్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్యూరి ప్రకటించింది.

ఆ మ్యాచ్‌లో 329 ప‌రుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పంత్ 89 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. తద్వారా గబ్బాలో 32 ఏళ్లుగా ఓటమంటూ ఎరుగని ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించాడు ఈ టీమిండియా డైనమైట్‌.

ఇదిలా ఉంటే, ఈస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకటించిన 15వ ఎడిష‌న్ అవార్డుల్లో న్యూజిలాండ్ సార‌థి కేన్ విలియ‌మ్స‌న్ కెప్టెన్ ఆఫ్ ద ఇయ‌ర్ 2021 అవార్డుకు ఎంపికయ్యాడు. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియ‌న్షిప్ 2021లో కివీస్‌ గెలిపించినందుకు గాను అతడిని ఈ అవార్డు వరించింది.

ఈస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకటించిన ఇత‌ర అవార్డుల్లో ఉత్తమ టెస్ట్ బౌలింగ్ అవార్డుకు కైల్ జేమీస‌న్ , వ‌న్డే బ్యాటింగ్ అవార్డుకు ఫ‌ఖ‌ర్ జ‌మాన్, వ‌న్డే బౌలింగ్ అవార్డుకు స‌కీబ్ మ‌హమూద్, టీ20 బ్యాటింగ్ అవార్డుకు జోస్ బ‌ట్ల‌ర్ , టీ20 బౌలింగ్ అవార్డుకు షాహీన్ అఫ్రిది , డెబ్యూటెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డుకు ఒలీ రాబిన్స‌న్‌ ఎంపికయ్యారు.

అజిత్ అగార్క‌ర్‌, ర‌సెల్ ఆర్నాల్డ్‌, ఇయాన్ బిష‌ప్‌, డారిల్ కలినన్‌, డారెన్ గంగా, టామ్ మూడీ, డేనియల్ వెటోరిలతో కూడిని 20 మంది సభ్యుల జ్యూరీ అవార్డు విన్నర్లను ఎంపిక చేసింది.