ఫేస్ బుక్ ప్రేమ…గుడికి వెళ్తుండగా యాక్సిడెంట్…అమ్మాయి మృతి !

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన దాడి శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోని రాంనగర్‌లో నివాసముంటూ క్యాటరింగ్‌ పని చేస్తున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మునేసుల అరుణ (19) హైదరాబాద్‌ నాంపల్లిలోని వనితా మహావిద్యాలయంలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి ఈ మధ్యనే ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. చదువయ్యాక తమ ప్రేమను వివాహ బంధంగా మార్చుకోవాలని కలలు కన్నారు. ఇళ్ళల్లో చెప్పి ఒప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం దేవుడి ఆశీర్వాదం కోసం యాదగిరిగుట్టకు బైక్‌పై బయలుదేరారు. అయితే విధి వక్రించి ప్రమాదంలో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ప్రేమగాథ బీబీనగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్దచెరువుకట్ట సమీపంలోకి రాగానే వీరి బైక్ అదుపుతప్పి జారింది. దీంతో ప్రేమికులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఆ వెనకాలే వేగంగా వచ్చిన కారు వీరిపై నుంచి వెళ్లిపోయింది. శ్రీకాంత్‌కు హెల్మెట్ ఉండటంతో గాయాలతో బయటపడగా అరుణ తలపై నుంచి కారు చక్రాలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సమాచారం అందుకున్న బీబీనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని అరుణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.